01-07-2025 12:11:31 AM
టెహ్రాన్, జూన్ 30: ఇరాన్ మతగురువు అయతొల్లా నాసెర్ మకరెం షిరాజీ సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరబిక్ భాషలో ఫత్వా జారీ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమే నీ, ఇతర సీనియర్ మతగురువులను బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఈ ఫత్వా జారీ చేశారు.
ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా ప్రకటించారు. ఫత్వాలో షిరాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇస్లామిక్ వ్యవస్థకు మూలస్తంభాలైన నాయకుల ప్రాణాలకు, మరీ ముఖ్యంగా సుప్రీం లీడర్ ప్రాణాలకు ముప్పు తలపెట్టడం మతపరంగా నిషిద్ధం.’ అని పేర్కొన్నారు.
మరణ శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది..
ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ ఏకతాటిపైకి రావాలని షిరాజీ పిలుపునిచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ నేతలను గద్దెదించేందుకు ఐక్యంగా పోరాడాలన్నారు. వీరికి ఏ ముస్లిం వ్యక్తి, ఇస్లామిక్ దేశమైనా మద్దతు సహకారం అందించినా అది హరాం లేదా నిషిద్ధం అవుతుందన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఇటువంటి శత్రువులకు, వారి బహిరంగ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలి.
వారు అతిపెద్ద శిక్షను ఎదుర్కొంటారు. ఇస్లాం కు ద్రోహం చేసే వారికి మరణశిక్ష తప్పదు. వారిపై ని స్సందేహంగా ప్రతీకారం తీర్చుకుంటాం.’ అని హెచ్చరించారు. బహిరంగ నేరాలు చేసేవారు ముహారిబ్కు బాధ్య త వహించాల్సి ఉంటుందన్నారు. ఈ ఇస్లామిక్ పదానికి దేవుడిపై యుద్ధం చేసేవాడు అని అర్థం. ఇరాన్లో ఇది చాలా తప్పు. వారికి మరణదండన విధిస్తారు.