03-05-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, మే 2(విజయక్రాంతి) :వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
శుక్రవారం ఆమె మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల జిల్లా అధికారులు వడదెబ్బ నివారణపై వారివారి శాఖల ప్రణాళికకు అనుగుణంగా వేసవి తీవ్రత సమయంలో చేయవలసినవి, చేయకూడని వాటి గురించి క్షేత్రస్థాయిలో ప్రతి నివాస ప్రాంతంలో ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని, తప్పనిసరిగా ప్రజలు జాగ్రత్తలు పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.
వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కార్మికులు ఉదయం వేళలోనే పనులు చేసేలా, పని ప్రదేశాలలో తప్పనిసరిగా నీడనిచ్చేలా షామియానాలు, తాగునీటి వసతి అందుబాటులో ఉండే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందని కలెక్టర్ తెలిపారు.
అన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీ.హెచ్.సీలలో వైద్యాధి కారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ, వడదెబ్బ నివారణ ఔషధాలు సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
ఓటరు జాబితాను సరిచేయాలి..
తప్పులు లేకుండా ఓటరు జాబితాను సరి చేయాలని కలెక్టర్ క్రాంతి ఆదేశించారు. ఏఈ ఆర్ఓలు , బిఎల్ఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. తప్పొప్పుల సవరణకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని, ఓటర్ జాబితా నుంచి తొలగింపునకు ఫామ్7, చిరునామా మార్పు, పేరులో తప్పొప్పులు లాంటివి ఫామ్ 8 లను పరిశీలించి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.