01-08-2025 12:37:42 AM
వైద్య ఉద్యోగులకు సెలవులు ఇవ్వద్దు
జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, జూలై 31: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఉద్యోగులకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వవద్దని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గురువారం చిన్నకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మండల పరిషత్, తహసిల్దార్ కార్యాలయం, పోస్ట్ ఆఫీస్, రైతు ఆగ్రోస్ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి తగిన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వవద్దని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నకోడూరులో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. దశలవారీగా పూర్తయిన ఇండ్లకు డబ్బులు విడుదల చేయాలని అధికారులు ఆదేశించారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి మధ్యాహ్నం భోజన నిర్వాహకులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట రూరల్ మండలంలోనీ పూల్లూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించి, విద్యార్థులతో మధ్యాహ్న భోజనం గురించి ఆరా తీసి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల పరిసరాలు, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. సమయానికి భోజనం సరిగా ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.