08-10-2025 06:49:35 PM
వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులను అభినందించిన ప్రజలు..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం శివారులోని మంజీరా నదిలో బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బాన్సువాడ పోలీసులు చాకచక్యంగా కాపాడారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మద్నూర్ మండలం షేకపూర్ గ్రామానికి చెందిన రఘునాథ్ మంజీరా నదిలో దూకుతుండగా గుర్తించిన స్థానికులు వెంటనే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మంజీరా నది వద్దకు వెళ్లి నీటిలో గల్లంతై మునిగిపోతున్న రఘునాథును ఓడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారు.
తరచూ ఇంట్లో గొడవలు జరగడంతో మనస్థాపానికి గురై మంజీరా నదిలో దూకినట్లు వ్యక్తి వెల్లడించారు. వెంటనే ఆ వ్యక్తిని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రఘునాథ్ ఆరోగ్యం బాగుందని ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రఘునాథుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్థానికులు ఇచ్చిన సమాచారానికి వెంటనే స్పందించిన బాన్సువాడ కానిస్టేబుళ్లు, హోంగార్డులు శంకర్,పవన్,సతీష్,ఆనంద్ లు వ్యక్తి ప్రాణాలను కాపాడినందుకు ప్రజలు కుటుంబ సభ్యులు అభినందించారు.