05-12-2025 12:00:00 AM
సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు
కామారెడ్డి జిల్లా కనకల్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఘటన
కామారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మైలారం రవీందర్ రెడ్డి ఇత్తడి బిందెలు పంచుతూ ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఎఫ్ఎస్టీ ఇన్చార్జి కోల రాజేశ్వర్ తాడ్వాయి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా ఓటర్లకు పంచేందుకు 41 ఇత్తడి బిందెలు లభ్యమయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.
క్వాటర్ సీసాలకు, డబ్బులకు, విలువైన వస్తువులకు ఓటును అమ్ముకోవద్దని ఎస్ఐ సూచించారు. ఓటు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అత్యంత శక్తివంతమైన ఆయుధం అని దాన్ని వివేకంతో ఉపయోగించాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థి రవీందర్ రెడ్డి పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు.