29-06-2025 10:31:13 PM
ఆసుపత్రిని సీజ్ చేయాలని బంధువుల డిమాండ్..
దాడిలో ఓ కానిస్టేబుల్ తలకు గాయం..
ఆస్పత్రి వద్ద పోలీసుల బందోబస్తు..
సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్ (Prime Childrens Hospital)లో వైద్యుల నిర్లక్ష్యంతోనే మూడు నెలల బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తు హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జాటోత్ జలంధర్, మనిషా దంపతులకు మొదటి సంతానంగా బాబు పుట్టగా అతడికి నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చిందన్నారు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని పిల్లల ఆస్పత్రికి తీసుకవచ్చారన్నారు. దీంతో వైద్యులు వైద్యం ప్రారంభించగా మొదటి రెండు రోజులు మంచిగానే ఉన్నాడని తదుపరి ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పి వెంటనే ఖమ్మం లేదా హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పారన్నారు. దీంతో ఖమ్మం తీసుకెళ్లగా బాలుడు అప్పటికే మృతి చెందాడని తెలిపారన్నారు.
కాగా పూర్తిగా ప్రైమ్ పిల్లల హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాలుడు మృతి చెందాడని హాస్పిటల్లో సరైన వసతులు లేకుండా వైద్యం నిర్వహిస్తున్నారని బంధువులు ఆరోపించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు హాస్పిటల్ ను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడు మృతి చెందడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ బంధువులు అస్పత్రిపై దాడికి దిగి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఆవేశంతో రగిలిపోయిన బంధువులు ఆసుపత్రిపై రాయి రువ్వడంతో అది ఓ కానిస్టేబుల్ తలకు తగిలి గాయం అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చికిత్స నిమిత్తం అతనిని ఆసుపత్రికి తరలించారన్నారు. కాగా హాస్పిటల్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.