21-04-2025 12:29:53 AM
సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్
సిద్ధిపేట, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ముస్లింల మీద ప్రేమ అభిమానం ఉంటే వక్ఫ్ చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేపట్టిన దానిపై బీఆర్ఎస్ వైఖరీ వెల్లడించాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ ముస్లిమ్ ల కోసం ఎప్పుడు పనీ చేయలేదని, లేనిపోని మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. దేశంలో అనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీలకు అందించిన 4శాతం రిజర్వేషన్ ఇప్పటికీ అమలు అవుతుందన్నారు.
కేవలం ఎన్నికలప్పుడు ముస్లిమ్ ఓట్లు దండుకునేందుకు బీఆర్ఎస్ రిజర్వేషన్ 12 శాతం ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలపాటు కాలయాపన చేసిన విషయం ఫరూఖ్ హుస్సేన్ కు గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో బీఆర్ఎస్ సహకరిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలనీ వారి చీకటి స్నేహం మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలకు అర్థమయ్యిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు.
మైనార్టీలు అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైపే ఉన్నారని, వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్చకుండా ఉండేందుకు మోడీ గద్దె దిగే వరకు పోరాటం చేస్తామన్నారు. మైనారిటీలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదరి మధు, యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు సలీం, నాయకులు ఫయాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.