19-11-2025 12:40:03 AM
అక్రమ సంబంధమే కారణమా ?
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
నర్సాపూర్(మెదక్), నవంబర్ 18 : యువకుడు దారుణహత్యకు గురైన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం నర్సాపూర్ రాయరావు చెరువు సమీపంలోని చెట్ల పొదల్లో ఫారూక్ (25) అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతుడి ఒంటిపై 11 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య వెనుక అక్రమ సంబంధం కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
సంఘటన స్థలాన్ని డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ రెడ్డి పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఫారూఖ్ నర్సాపూర్ కు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఇటీవల ఓ మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మహిళ భర్త, మరో వ్యక్తితో కలిసి హత్యకు కుట్ర పన్నినట్టు మృతుడి కుటుంబీకుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.