11-12-2025 01:14:58 AM
జిల్లా పౌరసరఫరాల అధికారి పీ.నిత్యానందం
మెదక్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ప్రజలకు పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలని పౌరసరఫరాల అధికారి నిత్యానందం బంకు నిర్వాహకులకు సూచించారు. బుధవారం మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ బంక్ నుఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా ఇంధన కొలతలు, నాణ్యత, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, వినియోగదారులకు కల్పించాల్సిన కనీస మౌలిక వసతులను పరిశీలించారు.
తనిఖీలో ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్ పేపర్ టెస్ట్లో అనుమానాస్పద ఫలితాలు,తాగునీరు, టాయిలెట్స్, ఫస్ట్ ఎయిడ్, టైర్లకు ఉచిత గాలి వంటి సదుపాయాల లేమి వంటి పలు లోపాలు బయటపడ్డాయి. చట్టప్రకారం పెట్రోల్ బంకుల్లో ఈ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని, వినియోగదారులను మోసం చేసే విధంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.
బ్ంప ప్రాథమిక కేసు నమోదు చేసి, సంబంధిత చట్టాల కింద వివరణ కోరినట్లు, అవసరమైతే బంక్ను సీజ్ చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే బంకులపై ఎటువంటి కనికరం చూపబోమని స్పష్టం చేశారు.