12-10-2025 12:47:13 AM
నలుగురిపై కేసు నమోదు
నాగర్కర్నూల్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న జిమ్సెంటర్లో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడి దాడి చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సు గోవర్ధన్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అండర్సన్ అనే యువకుడు గగ్గలపల్లి ప్రాంతంలోని సోలార్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న విగోల్డ్ అనే జిమ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు.
శుక్రవారం జిమ్ చేస్తున్న క్రమంలో యువకుడి చేతి పక్కనే ఉన్న మరో యువకుడి చేతికి అనుకోకుండా తగలడంతో మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. గంజాయి బ్యాచ్గా పేరు మోసిన గ్యాంగ్ వచ్చి ఆ యువకుడ్ని చితకబాదిన విషయం తెలిసిందే.
విజయక్రాంతి దినపత్రికలో కథనం ప్రచురితం అయిన అనంతరం కేసు నమోదు కాకుండా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోలీసులు సమాలోచనలు చేసుకొని ఎట్టకేలకు మారి కార్తీక్, కౌశిక్, తరుణ్, షరీఫ్ అనే యువకులపై కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.