04-06-2025 09:44:25 PM
అమరావతి: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ ఘటనపై పోస్టులు పెట్టారు.
బెంగళూరులో జరిగిన దురదృష్టకర తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం తనకు చాలా బాధ కలిగించిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన విషాద ఘటన తనను దిగ్భాంతికి గురి చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ముతుల్లో చిన్నారులు కూడా ఉండటం బాధాకరమని, ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో విషాదం జరగడం చాలా దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాని, తొక్కిసలాటలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు.