calender_icon.png 23 September, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కుల కోసం కదం తొక్కిన అడవి బిడ్డలు

23-09-2025 12:00:00 AM

-వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాల్సిందే..

- ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) :  అనాదిగా అడవులను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకం గా మారిందని, హక్కుల కోసం న్యాయపోరాటమే శరణ్యమని ఆదివాసి సంఘాలు నేతలు తమ ఆవేదనను వెళ్లగక్కారు. చట్టబద్ధతలేని వలస లంబాడా లను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

రాయి సెంటర్లు, సార్ మేడిలు, రాజ్ గోండు సేవా సమితి, తుడుం దెబ్బ ఇలా 9 ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ముం దుగా తంతోలి ముత్యాలమ్మ ఆలయం  నుండి ఆదిలాబాద్ కలెక్టరేట్ వరకు ఆదివాసీ మహిళలు, యువకులు, జెండాలు చేత పట్టుకొని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించి కలెక్టర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయా ఆదివాసి సంఘాల నాయకులు మాట్లాడుతూ... వివి ధ రాష్ట్రాల నుండి రిజర్వేషన్ల కోసం వలస వచ్చిన లంబాడాలతో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 1970 తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు వలస వచ్చిన లంబాడాలు తమ హక్కులను రిజర్వేషన్లను వినియోగించుకుంటూ తమ జీవన ప్రమాణాలు దెబ్బతిస్తున్నారని ఆరోపించారు. 

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల కుటుంబాలు ఎస్టీ రిజర్వేషన్ల కోసమే వలస వచ్చి ఉపాధి పొందుతున్నాయని వారు ఆరోపించారు. చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ  జాబితా నుంచి తొలగించాలని, ఇప్పటికే సుప్రీం కోర్టు నుండి ప్రభుత్వాలకు నోటీసులు కూడా అందాయని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు మంగం విశ్వంభర్,  గణేష్, తానాజీ, శ్యామ్ రావు, జంగు పటేల్, ఆనందరావు, వెంకటేష్ పాల్గొన్నారు.