17-10-2025 06:22:04 PM
సోలార్ సిస్టంపై పదవ తరగతి విద్యార్థులకు విద్యాబోధన
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిస్థితిని సమీక్షించిన అనంతరం కలెక్టర్ స్వయంగా 10 వ తరగతి విద్యార్థులకు సోలార్ సిస్టం పై కలెక్టర్ పాఠం బోధించారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులతో చర్చ జరిపి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, "పాఠశాలలు విద్యాగణనకు కేంద్ర బిందువులు. ఒక చిన్న మార్పు పిల్లల జీవితాలను మారుస్తుంది. అందుకే తరచూ పాఠశాలలకు వచ్చి విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమవడం అవసరం అని తెలిపారు.
ఈ పాఠశాల నుండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సందర్శనకు ఎంపికైన ఇద్దరు విద్యార్థినులను కలెక్టర్ అభినందించి, నోట్ బుక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారు మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. పాఠశాల యొక్క స్థితిగతుల పైన అలాగే మధ్యాహ్న భోజన పథకం పై ఆరా తీసి మెను ప్రకారం పౌష్టికాహారం ఇస్తున్నారా లేదా అనే విషయం అడిగి తెలుసుకున్నారు.