21-09-2025 12:18:03 AM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా సంబంధిత వర్గాలకు సకాలంలో రుణాలు అందజేసి బ్యాంకర్ లు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రీణాల్ శ్రేష్ట తో కలిసి జిల్లాలో ఉన్న బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వశక్తి సంఘాల రుణాలు రికవరీ, పీఎం స్వానిధి రుణాలు, ఎఫ్పీఒల ఏర్పాటు, ఇతర అంశాలపై డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రస్తుత సంవత్సరం రూ.2,291 కోట్ల పంట రుణ లక్ష్యానికి సెప్టెంబర్ చివరి వరకు రూ.409.55 కోట్లు, రూ.1,416.09 కోట్ల వ్యవసాయ టర్మ్ రుణాలకుగాను రూ.342.31 కోట్లు రుణాలు అందించామని అధికారులు తెలిపారు. రైతు రుణాల పంపిణీ అంశంపై బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ పంట రుణాల పంపిణీ గల కారణాలను ఆరా తీశారు. స్వయం శక్తి సంఘాలకు చేపల పెంపకం యూనిట్లు, కౌజు పిట్టల పెంపకం తదితర యూనిట్ల స్థాపనకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని, నిర్దేశించిన లక్ష్యాలకు తక్కువగా రుణాలు అందించిన అన్ని బ్యాంకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న 3 నెలల కాలంలో 500 యూనిట్ల స్థాపనకు బ్యాంకర్లు సహకరించాలని ఆ దిశగా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లక్ష్యసాధనకు బ్యాంకర్లు సహకరించకపోతే ఉపేక్షించేది లేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న రుణాల ప్రతిపాదనలు సైతం బ్యాంకర్లకు అందించి త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో బ్యాంకర్లకు అందాల్సిన గ్రూపు వివరాలు వెంటనే అందజేసేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పట్టణాలలో సైతం మెప్మా బృందాల వివరాలు బ్యాంకులకు అందించి రుణాలు మంజూరి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.