01-09-2025 05:58:12 PM
వరద బాధితులను ఆదుకోవాలీ: మాజీ ఎంపీ వెంకటేష్ నేత
మంచిర్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందని మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత విమర్శించారు. సోమవారం మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి నస్పూర్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలివచ్చి కలెక్టరేట్ ముందు వరద బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లితో కలిసి మాట్లాడారు.
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని, ఎన్టీఆర్ నగర్ నీట మునిగిన ఇండ్ల వరద బాధితులకు నష్టం పరిహారం, వరదతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అమలుకు నోచుకోని అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. వరదలతో ఎన్టీఆర్ నగర్ ప్రజలు, రైతులు నష్టపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం బాధితులను ఆదుకోలేదన్నారు.
ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ని కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వరద బాధితులకు నష్ట పరిహారం అందించాలని వినతి పత్రం అందజేశారు.