10-01-2026 09:11:00 PM
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల,(విజయక్రాంతి): బిఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 25 కోట్లతో పట్టణంలో సిసి రోడ్లు, డ్రైనేజిల నిర్మాణం చేశామని, మేము మంజూరు చేసిన పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభివృధి గుర్తొస్తోంది.
ఎన్నికల సమయంలో మాత్రమే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేయడం వారికి అలవాటుగా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా మున్సిపాలిటీకి చేసింది సున్నా అని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఈ రెండేళ్లలో పట్టణానికి చేసిందేమీ లేదని, ఒక్క పైసా కూడా పట్టణానికి తీసుకురాలేదని, బిఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 25 కోట్లతో పట్టణంలో సిసి రోడ్లు డ్రైనేజిల నిర్మాణం చేశామని, మేము మంజూరు చేసిన పనులకు శుక్రవారం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారని విమర్శించారు.
రెండేళ్ల నుండి చేయని శంకుస్థాపనలు శుక్రవారమే చేయడంలో ఆంతర్యం ఏమిటో పట్టణ ప్రజలు గ్రహించాలన్నారు. ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ శంకుస్థాపనల డ్రామాలని, ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీ చిట్యాల పట్టణంలో ఎన్ని నిధులు మంజూరు చేశారో ప్రజల ముందు ఉంచాలని, మేము మంజూరు చేసిన పనులకు శంకుస్థాపనలు చేయడం కాదు, కొత్తగా పనులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని, డబ్బు సంచులతో, అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, పట్టణ ప్రజలు కాంగ్రెస్ మోసాలను గ్రహించాలని, మీ పక్షాన నిలబడే వ్యక్తులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెల్ల లింగస్వామి, మాజీ జెడ్పిటిసి కౌన్సిలర్ చేపూరి రవీందర్, పొన్నం లక్ష్మయ్య, జనగాం నరసింహ గౌడ్ మరియు ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.