02-08-2025 12:07:04 AM
హాజరుకానున్న వరంగల్ జిల్లా న్యాయవాదులు
హనుమకొండ, ఆగస్టు 1 (విజయక్రాంతి): న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి చెందిన చట్ట, మానవ హక్కులు, ఆర్టీఐ విభాగం నిర్వహిస్తున్న వార్షిక లీగల్ కాన్క్లేవ్-2025ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వరంగల్, హనమకొండ కాంగ్రెస్ లీగల్ సెల్ సభ్యులు హాజరుకానున్నట్లు కాంగ్రెస్ లీగల్ సెల్ వరంగల్ కన్వీనర్ న్యాయవాది కొక్కొండ రమేష్ గురువారం తెలిపారు.
ఈ సమావేశంలో రాజ్యాంగ సవాళ్లు, దృక్కోణం, పరిష్కార మార్గాలు అనే అంశంపై చర్చ జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, న్యాయ వ్యవస్థ స్థితిగతులు మరియు ప్రజాస్వామ్య పరిరక్షణలో చట్ట వ్యవస్థ పాత్రపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యాయ నిపుణులు, లీగల్ సెల్ నేతలు ఈ సమావేశం లో చర్చించనున్నారని తెలిపారు. అనంతరం సభ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ లీగల్ సెల్ న్యాయవాదులు పాల్గొన్నారు.