26 February, 2026 | 2:32 AM

వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించాలి

26-02-2026 12:41 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): సంప్రదాయ పంటల సాగుతో పాటు గ్రామాల్లో వాణిజ్య పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించే విధంగా గ్రామ సర్పంచులు వార్డు సభ్యులు కృషి చేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న కోరారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు పరిపాలన, ప్రభుత్వ పథకాల అమలు, విధుల నిర్వహణపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగాఆయిల్ పామ్, ఉద్యాన, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ఆయన వివరించారు.

మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని, నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్, కూరగాయలు, ఆకు కూరలు, మునగ, వెదురు మొదలైనవి సాగు చేయాలని తద్వారా ఎకరానికి లక్ష రూపాయలు నికర ఆదాయం రైతులు పొందవచ్చని చెప్పారు.

ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రో ట్రే లో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం,

పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రీతం గౌడ్, డివిజనల్ పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.