06-06-2025 05:50:17 PM
పాలమూరు ప్రాంతంలో కృష్ణ పరవళ్ళు తొక్కుతుంది
గతంలో చేసిన ప్రాజెక్టులు పూర్తిచేసిన ఘనత కాంగ్రెస్ దే
పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం ... నీళ్లు పారిస్తం
ముసాపేటలో సబ్ స్టేషన్ల భూమి పూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పాలమూరు ప్రజల కలలను నిజం చేసే బాధ్యత ప్రజా పాలన ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గంకు మంజూరైన 12 సబ్ స్టేషన్ల కు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ అలుపెరుగని పోరాటం చేస్తూ నిరంతరం దేవరకద్ర నియోజకవర్గం కోసం పరితపించే ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిని గెలిపించుకోవడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఈ 12 సబ్ స్టేషన్లను ప్రారంభించుకునేందుకు రూ 71 కోట్లను ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు.
ముందస్తుగా ప్రజలకు విద్యుత్ సమస్యలు ఉండకూడదని పట్టుబట్టి దేవరకద్ర ఎమ్మెల్యే సబ్ స్టేషన్ల ను తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ ఒక్క విషయమే కాదని దేవరకద్ర నియోజకవర్గం సంబంధించి విద్యా వ్యవస్థలో జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. పలుమార్లు ప్రత్యేకంగా చర్చించి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ప్రజల ఓట్లతో గెలిచిన తర్వాత కాంట్రాక్టర్ల కోసం వ్యక్తిగత అవసరాల కోసం కాదని, ప్రజల సంక్షేమ కోసం నిరంతరం పోరాట చేసే వ్యక్తిగా పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధికి ఉండాలని తెలిపారు. ఓటర్లగొంతు గా మాట్లాడే వ్యక్తి కి నిలువెత్తు నిదర్శనం దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అని కొనియాడారు.
ప్రజల ఆశలు..ఆకాంక్షలే ప్రభుత్వ ఏజెండా
లక్ష్యాలను నెరవేర్చిందికే చట్టాలను చేసి అమలు పరచడమే తమ ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కృష్ణానది ఒడ్డునే ఉన్నాం కానీ నీరు మనకు రావడంలేదని ఉద్దేశంతో మనందరం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చామన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు తీసుకురావడం జరిగిందని, గత పది సంవత్సరాల ప్రభుత్వం ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. మాయమాటలు చెప్పి కాలం గడిపేరని అసహనం వ్యక్తం చేశారు. జూరాల, కోయిల్ సాగర్, బీమా ఫేస్ వన్ 1, 2, శ్రీశైలం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగిందని తెలిపారు. నార్లపూర్ దగ్గర మోటర్ ను ఆన్ చేసి నీళ్లు బయటకు రాగానే బంద్ చేసిన ఘనత మాజీ సీఎం కేసిఆర్ కి దక్కుతుందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించే శక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే ఉంటుందన్నారు.
వాస్తవాలను పరిశీలకు తీసుకుంటే నార్లపూర్ నుంచి ఎదుల వరకు రావలసిన నీరు విషయంలో ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పండుగ పేరున సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ ని పాలమూరు జిల్లాకు పిలిపించిప్రత్యేకమైన దృష్టి సారించి వెనకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధిని చేద్దామని పిలుపునిచ్చారన్నారు. మీరందరి సహాయ సహకారాలు అందిస్తూ నిధులు ఇవ్వాలని సూచించినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. సీఎం సూచన మేరకు క్యాబినెట్ అంతా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తుందని తెలియజేశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు పారిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైన నిధులను పూర్తిస్థాయిలో అందిస్తామని తెలిపారు. అవసరమైనచోట భూసేకరణతో పాటు అవసరమైన నిధులను పూర్తిస్థాయిలో అందిస్తామని భరోసా కల్పించారు. శంకర సముద్రానికి సంబంధించి ఆర్ఎన్ఆర్లో భాగంగా రూ13 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిసిందని, వాటిని విడుదల చేస్తామని తెలిపారు.
చౌదర్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ చేసేందుకు ఆర్థికపరమైనటువంటి మంజూరు చేస్తామని తెలిపారు. 20000 ఎకరాలు ఈ లిఫ్టు ఇరిగేషన్ ద్వారా పారితే అంతకన్నా సంతోషం ఏముంటుందన్నారు. ఆ నాటి ప్రభుత్వాలు ఏ పథకం చేపట్టిన మేము ఎప్పుడు ఆపలేదని, మనసుపెట్టి ఆలోచించండి.. ప్రతి ఒక్కరికి మంచి చేస్తున్నామని భరోసా ఇచ్చారు. రూ 22 వేల 500 కోట్లతో 4,50,000 ఇండ్లను రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం 12,500 కోట్లను విద్యుత్ శాఖ అందిస్తున్నామని స్పష్టం చేశారు. గృహ యజమానులు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి దాదాపు 50 లక్షల కుటుంబాలకు రూ 2 వేల కోట్లను చెల్లించడం జరుగుతుందన్నారు. దేవరకద్ర నియోజకవర్గం లో రూ 63వేల 226 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, 45వేల 155మంది కుటుంబాలకు 200 లోపు యూనిట్ల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గత ఇండ్లు ఎక్కడ నిర్మించిందని, రాష్ట్ర వ్యాప్తంగా బస్సులో ఉచితంగా మహిళలు ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.
రూ 21 వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలను మహిళ సంఘాలకు అందిస్తున్నమని తెలిపారు. ఐదేళ్లలో రూ. 1 లక్ష కోట్ల అందించాలని సంకల్పంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రూ 200 ఓట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించేందుకు ముందుకు సాగుతున్నమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ 20 వేల కోట్ల ను నిరుపేదలు చదువుకునేందుకు టెక్నాలజీతో నిర్మాణాలు చేపడుతున్నమని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే 40% మిస్ చార్జీలు, 200% కాస్మటిక్ చార్జీలు పెంచడం జరిగింది అని తెలిపారు. ఏ ఒక్కరోజు కూడా గత ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమ కోసం కృషి చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలో 56 వేల ఉద్యోగాలు అందించమని తెలిపారు. మరో 30000 ఉద్యోగాలు భద్ర చేయవలసి ఉందని తెలిపారు. రూ 8 వేల కోట్ల తో రాజీవ్ వికాసం అనే పేరు తో రుణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అన్యాయం ఎవరికి అయింది..?
గత ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని, కేవలం హంగు ఆర్భాటాలు మాత్రమే చేసిందని విమర్శించారు. అన్యాయం జరిగింది.. అన్యాయం జరిగిందంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఎవరికి అన్యాయం జరిగిందో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఖర్చుకు వెనకాడకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటుచేసి 6లక్షల 70 వేల ఎకరాలను సాగు చేసుకునేందుకు రైతులకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంచి చెయ్యాలని తపన వారికి లేదని, వారి ఇంట్లో వాళ్లే చెబుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకే లక్ష్యంపై ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ లను డిప్యూటీ సీఎం అందజేశారు. యాదవ గొల్ల కురుమలు డిప్యూటీ సీఎంకు గొర్రె పిల్లను బహుకరించారు.
అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా ప్రజలందరూ అందిస్తే అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేవలం కేసీఆర్కు మాత్రమే దక్కుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 22 మంది ముఖ్యమంత్రిలు రాష్ట్రాన్ని పరిపాలించాలని, తెలంగాణ రాష్ట్రం లో 65 వేల కోట్లు అప్పు ఉండేదని నూటికి 80 పైసల చొప్పున ప్రభుత్వం రూ.600 కోట్ల మిత్తి అకట్టేదన్నారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, నెలకు 6500 కోట్ల చొప్పున ఇప్పటివరకు 1 లక్ష 20 వేల కోట్ల ను వడ్డీ చెల్లించడం జరుగుతుందన్నారు. రూ.22 వేల కోట్లతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని, రూ.12 వేల కోట్లతో సోలార్ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
4 కోట్ల మంది గత ప్రభుత్వం చేసిన విధానాలతో ప్రజలు తీవ్ర ఆవేదన తో ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పారని, ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతా లో రూ 1500 కోట్లు ఉన్నాయని, గత 65 ఏళ్ల నుంచి పరిపాలించిన వివిధ పార్టీలలో ఇంత మొత్తం డబ్బు లేదంటే బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఇంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రజల నుంచి దోచుకొని దాచుకొని విధానాలతో టిఆర్ఎస్ ఎలా పడితే అలా వ్యవహరించిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలందరికీ మంచి చేస్తూ ముందుకు సాగుతుందని తెలియజేశారు.
కమిషన్లకు కక్కుర్తి పడ్డారు : దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
కమిషన్ల కోసం కక్కుర్తి పడి కాలయాపన చేసి ప్రజలకు మోసం చేసిన ఘనత బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని...చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న ప్రజల బిల్లులు పెండింగ్లో పెట్టి ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేసిన పనులకు సంబంధించి బిల్లులు ఎందుకు పెండింగ్ లేవని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరివేన ప్రాజెక్టు పేరు చెప్పి అడ్డాకల్, మూసాపేట, వేముల తో పాటు వివిధ చెరువులలో ఉండు మట్టిని తరలించి కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. ప్రజలకు ఇది చేస్తాం.. అది చేస్తామంటూ చెప్పి.. కాలయాపన చేసి ఏది చేయకుండానే పదేండ్లు పరిపాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన ప్రభుత్వము ప్రతి ఒక్కరి మేలును గుర్తించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తుంది అని తెలిపారు.
జూన్ 11 వ తేదీ ,2015 సంవత్సరంలో కెసిఆర్ కరువేన ప్రాజెక్టుకు వచ్చి ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చొని మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పి పది ఏళ్లు గడిచిన ఎందుకు చేయలేదని విమర్శించారు. కథలు చెప్పడంలో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ దిట్టగా ఉండాలని, ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లో చేసినవేనని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే కేటీఆర్ డల్లాస్ లో రూ 30 కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. మూడు సంవత్సరాల కాల వ్యవధిలో పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేస్తామని మాయమాటలు చెప్పారని పేర్కొన్నారు. చౌదర్ పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు మంజూరు చేయాలని చేయాలని కోరారు. దీంతో 20 వేల ఎకరాలలో భూమి సాగు అవుతుందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి లక్షలాదిమంది రైతులకు 20 వేల కోట్ల తో రుణ మాఫీ చేశామని తెలిపారు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రజలు ఇప్పుడు ఆస్తులుఅమ్ముకొని, అప్పులు చేసి తినే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని డబ్బులు పంచాయతీ కోసమే ఆందోళన చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వగురు అంటూనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు మేఘా రెడ్డి, అనిరుద్ రెడ్డి, మైనార్టీ ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెద్దుల కొత్వాల్, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జాయింట్ కలెక్టర్లు మోహన్ రావు, శివేంద్ర ప్రతాప్, సంజీవ్ ముదిరాజ్, మాజీ జెడ్పి చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, శెట్టి చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.