11-01-2026 12:00:00 AM
ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ
హైదరాబాద్, జనవరి 10 : గోపిచంద్ అకాడమీలో జరిగిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఉత్సాహం గా ముగిసింది. 8 రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర అండర్ 19 సింగిల్స్ విభాగంలో దేవ్ రూపారేలియా, బాలికల అండర్ 19 సింగిల్స్లో తన్వి పత్రి చాంపియన్లుగా నిలిచారు. అలాగే బాలుర డబుల్స్లో చరణ్ రామ్ తిప్పన, హరికృష్ణ వీరమ్రెడ్డి టైటిల్ గెలుచుకున్నారు.
ముగింపు వేడుకలకు హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ పటేల్ (దాజీ) ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడలు సమన్వయంపై స్ఫూర్తిదాయకమైన సందేశం అందించారు. గెలుపోటములను రెండింటినీ సమానంగా స్వీకరించే దృక్పథమే నిజమైన క్రీడాస్ఫూర్తిగా పేర్కొన్నారు. ఎన్బిఏ దిగ్గజ మైకేల్ జోర్డాన్, కోచ్ ఫిల్ జాక్సన్ కథను వివరించి వారిలో ఉత్సాహం పెంచారు. ధ్యానం చేయడం ద్వారా ఏ రంగంలోనైనా ఏకాగ్రత సాధించొచ్చని చెప్పుకొచ్చారు. ప్రతీ మ్యాచ్కు ముందు క్రీడాకారులు ధ్యానం చేయాలని సూచించారు.