13-12-2025 12:00:00 AM
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి, డిసెంబర్ 12 ( విజయక్రాంతి ) : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తేనే గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వనపర్తి మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అప్పాయిపల్లి, కీర్యతండా, కాశీంనగర్, కాశీంనగర్ తాండ, చిట్యాల పెద్దగూడెం, దత్తాయిపపల్లి, చందపురం, మెంటేపల్లి, కడుకుంట్ల, కిష్టగిరి, కిష్టగిరి తాండ, పెద్దగూడెం తాండ, నాచ హళ్లి తో పాటు పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మరో పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ప్రస్తుతం మూడేళ్లు తాను ఎమ్మెల్యేగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు రవి ఎంపీగా ఉంటారని గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులనే అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే సూచించారు.
పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో గ్రామాలలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కేవలం అభివృద్ధి పనుల మాటున అందిన కాడికి దోచుకున్నారే తప్ప గ్రామాలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జడ్పీటీసీ గొల్ల వెంకటయ్య ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు యువకులు పాల్గొన్నారు.