12-09-2025 08:23:06 PM
ముస్తాబాద్,(విజయక్రాంతి): సిఎస్ ఆర్ నిధులతో మోడీ గిఫ్ట్ కానుకగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ బడిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా 20,000 సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు.అందులో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు 85 సైకిళ్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయి గోపి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే పిల్లలంతా పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే కాబట్టి తమ ఇంటి నుండి బడికి వెళ్లి రావడానికి తగిన రవాణా సౌకర్యాలు లేక ఆటోలు, బస్సులకు వెళ్లాలంటే ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. అలాగే పదవ తరగతి చదివే విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా పాఠశాల లోనే ఉండాల్సి వస్తుందన్నారు.విద్యార్థులకు రవాణా ఇబ్బందులు రాకుండా ఉండాలనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండటం విశేషమన్నారు.బాగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. స్మార్ట్ ఫోన్ లకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.