15 April, 2026 | 9:35 AM

దివ్యాంగుల ప్రతిభను వెలికి తీయాలి

22-12-2025 07:53 PM

ఆర్మూర్‌ భవిత కేంద్రాన్ని తనిఖీ చేసిన సహిత విద్యా విభాగం జిల్లా  కోఆర్డినేటర్‌

ఆర్మూర్‌,(విజయక్రాంతి): వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగుల ప్రతిభను వెలికి తీసి  వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్‌ పడకంటి శ్రీనివాస్‌రావు సూచించారు. ఆర్మూర్‌ పట్టణంలోని భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యా వనరుల కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా ఐఈ కోఆర్డినేటర్‌ నాగవేందర్‌తో కలిసి సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు.

కార్యాలయంలో రికార్డులను పరిశీలించి ఐఈఆర్పీలు కిషన్, సురేష్‌తో మాట్లాడారు. కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న సేవలను చూసి సంతృప్తి వ్యక్తం చేసారు. ఇటీవలి ప్రారంభించిన భవిత కేంద్రం భవన మరమ్మతుల పనులను పరిశీలించారు. కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యేలా వేయించిన వాల్‌ పెయింటింగ్స్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ఆయన వెంట జిల్లా ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ శ్రీధర్, ఆర్మూర్‌ మండల విద్యాధికారి రాజగంగారాం ఉన్నారు.