22-10-2025 08:35:48 PM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..
మాదక ద్రవ్యాల నియంత్రనకు చైతన్యం కార్యక్రమం: జిల్లా ఎస్పి రోహిత్ రాజు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలలో అవగాహన కలపించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచార వ్యూహాలు తదితర అంశాలపై చర్చ జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు.
జిల్లాలోని విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో వైద్యాధికారుల సహకారంతో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి, అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా అవసరమైన చికిత్స అందించాలని తెలిపారు. ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచనలు జారీ చేయడం జరిగింది. ఇంటర్ కళాశాలల్లో మాదక ద్రవ్యాల వినియోగ వల్ల కలిగే నష్టాలపై యువత, విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అని అన్నారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లు, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చైతన్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం ద్వారా మా దగ్గర నియంత్రణకు కాటన్ సెర్చ్ లు, సైకిల్ ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను నష్టాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. తెలంగాణలోని మొట్టమొదటిసారిగా మా దగ్గర రవాణా చేస్తూ పట్టుబడిన వారికి పి అండ్ పి ఎస్ నమోదు చేయడం జరుగుతుందని రానున్న రెండు వారాల్లో ఇది అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. మాదకద్రవ్యాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని అన్ని శాఖలు సమన్వయంతో మాదకద్రవ్యాలను నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో ఇల్లందు డిఎస్పి చంద్రబాను, ఇంటర్మీడియట్ అధికారి వేంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి జయలక్ష్మి, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.