06-12-2025 12:00:00 AM
మహబూబాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణ పరిధిలో పాఠశాల విద్యార్థుల రక్షణ, భద్రతను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీస్ లు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది స్కూల్ బస్సుల డ్రైవర్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
విద్యార్థులను తరలించే డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడపకుండా ముందస్తు చర్యగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్.ఐ తెలిపారు. పరీక్షల్లో ఎవరైనా మద్యం సేవించినట్లు గుర్తించినట్లయితే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని, పిల్లల ప్రాణాలకు ప్రమాదం కలిగించే ఏ నిర్లక్ష్యాన్నీ సహించబోమని ట్రాఫిక్ ఎస్.ఐ హెచ్చరించారు. పాఠశాల బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, పిల్లల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా భావించాలన్నారు.