03-05-2025 05:36:26 PM
ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్...
మహబూబాబాద్ (విజయక్రాంతి): గాలివానకు మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను, విద్యుత్తు లైన్లో మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్(NPDCL Director Madhusudan) అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని ఆదేశించారు. గాలి వానలకు మహబూబాబాద్ డివిజన్ పరిధిలో దెబ్బతిన్న విద్యుత్తు స్తంభాలను, లైన్లను ఆయన శనివారం పరిశీలించారు. మహబూబాబాద్ డివిజన్ పరిధిలోని జమాండ్లపల్లి, ముత్యాలంగూడెం, చంద్రు తండా, మహబూబాబాద్, అనంతారం, గాంధీపురం, గడ్డిగూడెం, రెడ్యాల, గుండ్రాతిమడుగు, బయ్యారం, జగ్గు తండ, సంగ్యా తండా, గార్ల, గొల్లచర్ల తదితర ప్రాంతాలలో చెట్లు విరిగి విద్యుత్ లైన్ల మీద పడటంతో లైన్లు తెగిపోయి.
343 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని, 33, 11 ఫీడర్ లైన్లో తెగిపోవడం వల్ల సుమారు 90 గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని అధికారులు డైరెక్టర్కు వివరించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వెంటనే అప్రమత్తమైన విద్యుత్ అధికారులు, సిబ్బంది పున్నరుద్దరణ పనులు చేపట్టి విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఇతర అధికారులు కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం సరఫరా తీరు తెన్నులను పర్యవేక్షిస్తూ, పలు సూచనలు చేస్తున్నారన్నారు. ఈదురుగాలుల వలన చెట్లు విరిగి పోల్ లు పడిపోయిన చోట్ల విద్యుత్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేపడుతున్నారన్నారు. వినియోగదారులకు విద్యుత్ సరఫరా అందించడానికి సిబ్బంది, అధికారులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, క్షేత్ర స్థాయిలో ఉండి పునరుద్దరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ నరేష్, డి ఈ లు విజయ్, పెద్దిరాజం, సునీతాదేవి, డివిజన్ పరిధిలోని విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.