17-01-2026 12:00:00 AM
డీఎస్పీ ప్రసన్నకుమార్
సూర్యాపేట, జనవరి 16 (విజయక్రాంతి) : రోడ్డు భద్రత పట్ల ఉద్యోగులు పౌరులను ప్రభావితం చేయాలని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత మహోత్సవాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘అరైవ్ ఎలైవ్’ కార్యక్రమంలో భాగంగా పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉందన్నారు.
రోడ్డు భద్రత పట్ల సామాన్య ప్రజలు, యువతలో అవగాహన పెంచడంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావవంతంగా వ్యవహరించాలన్నారు. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపకుండా చూడాలన్నారు. అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు భద్రత కార్యక్రమాలు ఉద్యమంలా కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంలోఎంఈఓ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, టౌన్ ఎస్ఐలు మహేంద్రనాథ్, శివతేజ, ఐలయ్య, ఏఎంవీఐ విక్రమ్, ఏఎంవీఐ సంపత్తో పాటు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.