10-06-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ జూన్ 9 (విజయక్రాంతి ): విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25శాతం పేద విద్యార్థులకు విద్యనందించాలని సామాజిక ఉద్యమకారుడు వావిలాల రాజశేఖర్ శర్మ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలను తీసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోయారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 25శాతం పేద, మధ్య తరగతి విద్యార్థులకు సీట్లు కేటాయించాలని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఎక్కడా అమలుపర్చడం లేదన్నారు. అమలుపర్చని పాఠశాలలపై చర్యలు తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎం.ఈ.వో, డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.