10-06-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, జూన్ 9 (విజయక్రాంతి): జగిత్యాల మున్సిపల్ పరిధిలో వార్డుల పునర్విభజనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.పట్టణంలోని ఇందిరా భవన్ నుండి కాంగ్రెస్ నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని నిరుపేద కుటుంబాల కోసం నూకపల్లి అర్బన్ హౌస్ కాలనీలో 4000 గృహాలను నిర్మించగా అట్టి కాలనీని మున్సిపల్ లో విలీనం చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని కనుగుణంగా జగిత్యాల మున్సిపాలిటీలో రెండు వార్డులను అదనంగా పెంచిందన్నారు.
అయితే నూక పెళ్లి అర్బన్ కాలనీలోనే రెండు వార్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా జగిత్యాల పట్టణంలోనే మార్పులు చేర్పులు చేస్తూ రెండు అదనపు వార్డులను ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. జీవన్ రెడ్డి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్, మాజీ కౌన్సిలర్లు దుర్గయ్య, గాజుల రాజేందర్, నక్క జీవన్, నాయకులు బండ శంకర్, కొత్త మోహన్ తదితరులుఉన్నారు.