27-11-2025 07:53:41 PM
ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిశీలకులు మల్లయ్య బట్టు
వనపర్తి టౌన్: జిల్లాలో గ్రామ పంచాయతి ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిశీలకులు మల్లయ్య బట్టు కోరారు. వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా, సవ్యంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మల్లయ్య బట్టు, మేనేజింగ్ డైరెక్టర్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫోన్ నెంబర్ 9110526278, ను వనపర్తి జిల్లా సాధారణ పరిశీలకులుగా నియమించగా ఎన్నికల వ్యయ పరిశీలకులుగా యం. శ్రీనివాసులు, జిల్లా ఆడిట్ ఆఫీసర్, నాగర్ కర్నూల్ ఫోన్ నంబర్ 8712475079 ను నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణములో ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, ఎన్నికల సిబ్బంది అలసత్వానికి తావు లేకుండా కృషి చేయాలని సూచించారు. ఉదయం వీరయపల్లి, పెద్దమందడి గ్రామాలలో నిర్వహిస్తున్న నామినేషన్ ప్రక్రియను పరిశీలించడం జరిగిందని, అన్ని సజావుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూం 08545-233525 నెంబరు ఫొన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు మాట్లాడుతూ అభ్యర్థులు ప్రచారానికి చేసే ప్రతి పైసా షాడో టీమ్ ద్వారా లెక్కింపు చేయడం జరుగుతోందని, అన్ని మండలాల్లో ఎ.ఈ.ఓ లను నియమించడం జరిగిందని ఖర్చుకు సంబంధించిన వివరాలు ఈరోజుకు ఆరోజు ఎ.ఈ.ఓ లకు పంపించాలని సూచించారు. 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు, లిక్కర్ పట్టుబడితే సీజర్ టీమ్ కు అప్పగించాలని సూచించారు.
సమన్వయ సమావేశం నిర్వహించుకున్నాం.... జిల్లా ఎస్పీ డి. సునీత
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఇప్పటికే సమన్వయ సమావేశం నిర్వహించుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ డి. సునీత అన్నారు. 3 ఎఫ్.ఎస్.టి, 3 ఎస్.ఎస్.టి బృందాలతో పాటు 4 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సమస్యాత్మక, సున్నితమైన, పోలింగ్ కేంద్రాలను రెవెన్యూ అధికారుల సహాయంతో గుర్తించడం జరిగింది ఎక్కడ సమస్యలు ఉత్పన్నం కాకుండా కట్టుదిట్టంగా భద్రత చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎస్పీ ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.