08-10-2025 05:37:50 PM
తాసిల్దార్ కనకయ్య..
హుజురాబాద్ (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని హుజూరాబాద్ తహశీల్దార్ కే కనుకయ్య స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బుధవారం వారోత్సవాల సదస్సు నిర్వహించారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ జిల్లా కన్వీనర్ గూడూరు స్వామి రెడ్డి అధ్యక్షతన సదస్సు నిర్వహించగా తహశీల్దార్ కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరులు కోరిన సమాచారాన్ని 30 రోజులలోపు తప్పనిసరిగా అందించాలని కనకయ్య స్పష్టం చేశారు.
సమాచారం పొందడం ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు. పౌరులు అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లో ఇవ్వడంలో అధికారులు విఫలమైతే, సంబంధిత అధికారులు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్కు బాధ్యులవుతారని హెచ్చరించారు. సమాచార హక్కు చట్టం 2005 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి, అధ్యాపకులు కొలిపాక రమేష్, నవీన్ కుమార్, స్వప్న, ముత్యంరెడ్డి, అనిల్ కుమార్, రాజిరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.