calender_icon.png 25 August, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందనూలులో నకిలీ ఎరువుల కలకలం.!

25-08-2025 04:10:23 PM

నాణ్యమైన ఎరువులని చెప్పి నాసిరకమైన ఎరువుల అమ్మకం..

గత రెండు రోజుల ముందు షోకాస్ నోటీసులు అందుకున్న దుకాణంలోనే నకిలీ ఎరువులు వెలుగులోకి..

ఎరువుల బస్తాలతో కలెక్టరేట్ ముందు రైతుల నిరసన..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District)లో నకిలీ ఎరువులు అంటగట్టారని రైతులు కలెక్టరేట్ ముందు ఎరువుల బస్తాలతో నిరసన తెలిపారు. ఈ ఘటన సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిసరాల్లో ఉన్న నాగార్జున ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువుల బస్తా కొనుగోలు చేశారు. నాణ్యమైన డిఏపి ఎరువు బస్తా ధర తీసుకున్న ఫర్టిలైజర్ దుకాణదారు నాసిరకమైన తేలికపాటి బరువు గల ఎరువులను అంటగట్టారని పొలం వద్దకు తీసుకువెళ్లి బస్తా ఓపెన్ చేశాక ఈ బండారం బయటపడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

గత రెండు రోజుల క్రితమే రైతులకు యూరియా బస్తాల పేరుతో ఓల్డ్ స్టాక్ ఎరువులను బలవంతంగా అంటగాడుతూ యూరియా బస్తా కూడా అధిక ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న విషయంలో వార్తలు ప్రసారం కావడంతో అధికారులు శోకాస్ నోటీసులను జారీ చేశారు. షోకాస్ నోటీసులకు వివరణ ఇవ్వకముందే ఈ నకిలీ ఎరువుల విషయం బయటపడటం విశేషం. ఇదే విషయంపై స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. మీడియా ముందు తమ గోడు వెళ్ళబోసుకుంటున్న క్రమంలోనే నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఎరువుల దుకాణడారు ఓ మధ్యవర్తికి ఫోన్ చేసిన వెంటనే కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వకుండానే ఎరువుల బస్తాలను తిరిగి ఆటోలో వేసుకొని వెణుతిరిగారు. భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి తన దుకాణంలో కొనుగోలు చేసిన ఎరువులు అన్ని నకిలీవే అయి ఉంటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.