25-08-2025 04:14:49 PM
విద్యార్థులకు అవగాహన కల్పించిన సైబర్ వారియర్స్..
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోని హంసిణి డిజి స్కూల్, ధార్మిక లిటిల్ జీనియస్ స్కూల్ల్లో సోమవారం సైబర్ క్రైమ్(Cybercrime) అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారియర్స్ విద్యార్థులకు సైబర్ మోసాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో, వాటి నుండి ఎలా రక్షించుకోవాలో వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన పట్టణ సీఐ వీర ప్రసాద్ మాట్లాడుతూ… “పిల్లలు, పెద్దలు అందరూ సైబర్ దాడుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారు. తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్కు వెంటనే స్పందించకుండా కొంత సమయం ఆలోచించి స్పందించాలి” అని సూచించారు.
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. సైబర్ వారియర్ జి. రాజశేఖర్ 30 రకాల సైబర్ మోసాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫోటోలు, వీడియోల సహాయంతో పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. “సైబర్ మోసాలు కేవలం పిల్లలకు మాత్రమే కాదు, చదువుకున్న పెద్దవారూ బాధితులే. అందరూ ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి” అని ఆయన చెప్పారు. స్కూల్ కరస్పాండెంట్ నరాల సంతోష్ మాట్లాడుతూ… “ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, పెద్దలు అప్రమత్తంగా మెలిగి ఆర్థిక, వ్యక్తిగత నష్టాల నుండి తప్పించుకోవచ్చు. పిల్లలు మొబైల్, ఇంటర్నెట్ను దుర్వినియోగం చేయకుండా ఉంటారు” అని పేర్కొన్నారు. అనంతరం స్కూల్ కరస్పాండెంట్ నరాల సంతోష్ ఆధ్వర్యంలో సీఐ వీర ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.