మత్తుకు బానిసైతే జీవితం చిత్తవుతుంది
మధురానగర్ సీఐ ప్రభాకర్
జూబ్లీహిల్స్, జూన్ 22 (విజయక్రాంతి): మత్తుకు బానిసైతే జీవితం చిత్తవుతుందని మధురానగర్ పోలీస్ స్టేషన్ సీఐ హెచ్.ప్రభాకర్ హెచ్చరించారు. స్టేషన్ ఆధ్వర్యంలో డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మధురానగర్ మెరిటో జూనియర్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సీఐ మాట్లాడారు. మత్తుకు బానిసవ్వడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు.
అంతేకాకుండా కుటుంబ సభ్యులకు బాధ కలుగుతుందన్నారు.సమాజంలో పరువుపోయి తీవ్ర వేదనకు గురి కావాల్సి వస్తుందన్నారు. మత్తుకు బానిసైనవారు తమ జీవితంతో పాటు తమతో ఉండేవారి జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తారని వివరించారు. అంతేకాకుండా అసాంఘీక శక్తుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో భాగమయ్యే ముప్పు పొంచి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. సురక్షితమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






