11-08-2025 07:14:06 PM
దౌల్తాబాద్: రైతు బీమా పథకానికి అర్హులైన రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలని దుబ్బాక ఏడిఏ మల్లయ్య(ADA Mallaiah) అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులు ఇస్తున్న దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ పథకానికి జూన్ 5వ తేదీ వరకు నూతనంగా పట్టా పాసు బుక్కు వచ్చిన వారు దరఖాస్తుకు అర్హులని అన్నారు. ఈ పథకానికి 18 నుండి 59 సంవత్సరాల నిండినవారు అర్హులని తెలిపారు. ఇంతకు ముందే రైతు భీమా నమోదు చేసుకున్న రైతులకు ఎలాంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రైతు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, రైతు బీమా ఫారం, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ లతో ఈ నెల 12వ తేదీలోగా సంబంధిత ఏఈఓ లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్, ఏఈవోలు సంతోష్ కుమార్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు..