నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి
మంత్రులను, ఎంపీలను రాకుండా అడ్డు పడితే నిధులు ఎలా వస్తాయి..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి..
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వంలో జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రులుగా ఉన్నారని, వారి దగ్గరికి పోయి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి(Congress Party state leaders Chelamalla Krishna Reddy) అన్నారు. సోమవారం చండూరు పట్టణ కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ఉందో, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసింది ఏమి లేదని ఆరోపించారు. నిధులు లేకుండా అధికారులపై ఒత్తిడి చేస్తే ప్రయోజనం ఉండదని, నిధులు తెచ్చి సాగునీరు తాగునీరు కొరకు శశిలేటి వాగు ఫీడల్ ఛానల్, వెల్మ కన్న ఫీడల్ ఛానల్ మిగతా ఫీడెల్ ఛానల్ ద్వారా చెరువులు కుంటలు నింపి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
మంత్రులను ,ఎంపీలను నియోజకవర్గంలో పర్యటించకుండా రాజగోపాల్ రెడ్డి అడ్డుపడితే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. నీ పదవులకు నేను అడ్డు కాదు నువ్వు ఏ పదవన్న తెచ్చుకో కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నది నా లక్ష్యంమని కృష్ణారెడ్డి అన్నారు. అనంతరం మర్రిగూడ మండల కేంద్రంలో పార్టీ సీనియర్ నాయకులను, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ ముచ్చటించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.






