28-11-2025 12:51:44 AM
జగిత్యాల అర్బన్ నవంబర్ 27 విజయ క్రాంతి): రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.గురువారం మేడిపెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా,వేగంగా కొనుగోలు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ పరిస్థితిని ,తూకం విధానాన్ని ,17% తేమ శాతం నిర్వహణ, కేంద్రాల వద్ద వసతులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే వరి ధాన్యంపై ప్రభుత్వ నిబందనల మేరకు తేమశాతం తప్పనిసరిగా పరిశీలించి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కొను గోళ్ళు చేయాలని,కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాల ద్వారా తక్షణమే రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
క్లస్టర్ అధికారులకు కేటాయించిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన బరువు యంత్రాల నిర్వహణ ,ధాన్యం కొనుగోళ్ళు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎమ్మార్వో, ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.