26-08-2025 05:41:33 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. మంగళవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారుజామునే పెద్ద ఎత్తున యూరియా కోసం తరలివచ్చారు. రైతు వేదిక వద్ద బారులు తీరారు. అయినప్పటికీ అధికారులు పెద్దగా స్పందించలేదని ఆరోపిస్తూ తొర్రూరు ఇనుగుర్తి ప్రధాన రహదారిపై బైఠాయించారు.
విషయం తెలుసుకున్న కేసముద్రం అదనపు ఎస్ఐ కరుణాకర్, ఇనుగుర్తి మండల వ్యవసాయ అధికారి మహేందర్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి, 222 మంది రైతులకు టోకెన్లు అందించి యూరియా పంపిణీ చేశారు. మిగిలిన మరి కొంతమందికి యూరియా స్టాక్ రాగానే పంపిణీ చేస్తామని నచ్చజె చెప్పారు. కేసముద్రం సొసైటీ వద్దకు యూరియా కోసం సోమవారం రాత్రి నుండే రైతులు తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము వరకు నాలుగు నుంచి 500 మంది రైతులు అక్కడ గుమి గూడారు. పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకోగా సొసైటీ నిర్వాహకులు ఎరువుల కేంద్రాన్ని తెరవకపోవడంతో నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను క్యూ లైన్ లో నిలబెట్టారు. అనంతరం సొసైటీ నిర్వాహకులు, మండల వ్యవసాయ అధికారి వెంకన్న, ఏడిఏ శ్రీనివాసరావు తదితరులు 222 మంది రైతులకు టోకెన్లు అందించి యూరియా పంపిణీ చేశారు. మిగిలిన రైతులకు స్టాక్ వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.