07-09-2025 12:34:28 AM
నాగర్ కర్నూల్ /కల్వకుర్తి,సెప్టెంబర్ 6 ( విజయక్రాంతి): తన కూతురును చేతబడి చేసి చంపాడన్న అనుమానంతో తండ్రినే దారుణంగా హత్య చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలో చోటుచేసుకుంది. ఈ నెల మూడో తేదీన హత్య జరగగా ఈ విషయం పోలీసుల విచారణలో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కల్వకుర్తి పట్టణంలోని వాసవీనగర్ కు చెందిన బాలయ్య(70)కు ముగ్గురు కుమారులున్నారు.
చిన్న కుమారుడు బీర య్య కూతురు గత కొన్ని నెలల క్రితం గురుకుల పాఠశాలలో చదువుతూ ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు ఆత్మహత్యకు గల కారణం తన తండ్రి క్షుద్ర పూజలు చేసి ఉంటాడని కొడుకు అనుమానం పెంచుకున్నాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న బీరయ్య ఈనెల 3న వారి వ్యవసాయ పొలం వద్ద ఉన్న తండ్రిని కర్రతో దాడి చేసి కారు డిక్కీలో కుక్కి అపహరించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రి కొడుకు కోసం గాలింపు చేపట్టగా తన తండ్రిని తల మొండెం వేరుచేసి దుందుభి వాగులో మొండెం భాగాన్ని ఓ మురుగు కాల్వలో తల భాగాన్ని విసిరేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా రక్తం పంచుకు పుట్టిన కన్న కొడుకే తండ్రిని అత్యంత దారుణంగా నరికి చంపడానికి బలమైన కార ణాలు ఉండి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు.
పెద్ద కుమారుడు మృతి అనంతరం భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న బాలయ్య చిన్న కోడలిపై కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు, తన కూతురు మృతికి కారణం కూడా క్షుద్ర పూజలు అయి ఉంటాయన్న అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు తల, మొండెం భాగాలను స్వాధీ నం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.