25-06-2024 12:31:42 AM
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. ఐసీఐసీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కీలక షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. నిఫ్టీ 23,500 ఎగువన ముగిసింది.
ఉదయం సెన్సెక్స్ 76,885 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,209.90) నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపు నష్టాల్లోనే కొనసాగింది. అయితే 11 గంటల తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 77,423.02 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 131.18 పాయింట్ల లాభంతో 77,341 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 46.30 పాయింట్ల లాభంతో 23,547 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.48 గా ఉంది.సెన్సెక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ఫార్మా, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 85.58 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,337 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.