14-08-2025 02:08:32 AM
జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు
జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థినైనా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ యంత్రాగం సన్నద్ధంగా ఉన్నదని కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని కంట్రోల్ రూంను కమిషనర్ తనిఖీ చేశారు. ఫిర్యాదులపై ఆరా తీశారు.
24/7 అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయన్న హెచ్చరికలతో జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఉన్నత అధికారులను హెడ్ క్వార్టర్ లో ఉండాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే జోనల్ కమిషనర్ లు, డిప్యూటీ కమిషనర్ లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని గమనిస్తూ అపసవ్యతలను చక్కదిద్దుతున్నారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారని అన్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారులు శిథిలావస్థకు చేరిన భవనాలలో నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పౌరుల ఫిర్యాదులపై స్పందించేందుకు, సహాయక కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రభావంతంగా చేపట్టేం దుకు పోలీస్, హైడ్రా, విద్యుత్, జలమండలి, మెట్రో రైలు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.
నాలాల వద్ద రక్షణ చర్యలు చేపట్టామని, ప్రజలు లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకూడదని కమిషనర్ సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మ్యాన్ హోల్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దు జీహెచ్ఎంసి, జలమండలి, హైడ్రా సిబ్బంది, ప్రజల కు సూచించారు. ట్రాఫిక్ చోకింగ్ పాయింట్ లపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో భూగర్భ సంపులను నిర్మిస్తామని కమిషనర్ తెలిపారు.
మూసారాంబాగ్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలి
బుధవార ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మూసారాంబాగ్, మలక్పేట సర్కిల్ల పరిధిలో డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. మూసారాంబాగ్ వంతెన సహా ప్రగతిలో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించారు. మూసారాంబాగ్ బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని అన్నారు.
టౌన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సమన్వయంతోభద్రత ప్రమాణాలు నిక్కచ్చిగా పాటి స్తూ, వర్షాకాలంలో కనెక్టివిటీనీ పెంచుతూ రవాణా సౌకర్యాలు మెరుగుపరిచే కీలక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సూచించారు.