07-06-2025 12:00:00 AM
మంచిర్యాల, జూన్ 6 (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో శుక్రవారం నిర్వహించిన సమగ్ర ఆరోగ్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో క్షయ, మధుమేహం, రక్తపోటు, హెచ్ఐవి తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉన్నట్లయితే క్షయ వ్యాధిగా అనుమానించి తెమడ పరీక్షకు దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తమ రక్తపోటు, మధుమేహాల స్థాయిని తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. అధిక పోషకాలుండే ఆహారాన్ని తీసుకొవండం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని తెలిపారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి నిలువ నీటి గుంటలను పూడ్చివేసి దోమల ఉత్పత్తిని అరికట్టాలని కోరారు. చిన్న పిల్లలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందించాలని పిలుపునిచ్చారు. హెచ్ఐవి వ్యాప్తిని గూర్చి అవగాహన పెంపొందించుకొని ముందు జాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు.
ఈ శిబిరంలో వైద్యులు శివప్రతాప్, రామకృష్ణ, నిహారిక, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సీహెచ్ఓ రామమూర్తి, జిల్లా క్షయవ్యాధి ప్రోగ్రాం కోఆర్డినేటర్ సురేందర్, దిశా జిల్లా డాట్ మేనేజర్ సంతోష్, ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీలత, టీబీహెచ్ వి స్వప్న, ఏఎన్ఎంలు దివ్య, పద్మ అంగన్వాడి సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.