15-11-2025 12:00:00 AM
మహబూబాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు.
శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. తేమశాతం తగ్గిన వెంటనే ధాన్యాన్ని వెంటనే కాంటాలు నిర్వహించి రైతులకు డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, సొసైటీ చైర్మన్ మర్రి రంగారావు, తహాసిల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి తదితరులు పాల్గొన్నారు.