09-07-2025 07:06:09 PM
హైదరాబాద్: తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదని, కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మైనారిటీ విభాగం సమావేశానికి హాజరైన మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుసేన్, సలీం, బీఆర్ఎస్ మైనారిటీ నేత సొహయిల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తు చేయాలని, కేసీఆర్ ఉన్నప్పుడు మైనార్టీలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మైనార్టీ విద్యాసంస్థలు, అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్య అందించారని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అంతేకాదు దేశంలో మొదటిసారి ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనమిచ్చి గౌరవించిన రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.
మాజీ సీఎం కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చి ముస్లిం సోదరుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఏం చెప్పింది ఏంటి.. మైనార్టీ సబ్ ప్లాన్ ఇస్తాం, నాలుగు వేల కోట్లు మైనార్టీలకు బడ్జెట్ కేటాయిస్తాం. ఇమామ్, మౌజన్లకు రూ.5,000 నుండి రూ.12 వేలకు పెంచుతామన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కేసీఆర్ రూ.20 లక్షలు ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.25 లక్షలు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని హరీశ్ రావు మండిపడ్డారు.
ఇందులో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకువచ్చి వారితో మాట ఇప్పించాడని ఆరోపించారు. ఎన్నికల తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పత్తా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక లక్ష 12 వేల మంది పేద మైనార్టీ ఆడబిడ్డలకు షాదీ ముబారక్ కేసీఆర్ అందించాడని, కాంగ్రెస్ తులం బంగారం ఇస్తామని మోసం చేసి షాదీ ముబారక్ కూడా ఇవ్వడం లేదన్నారు.
మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేసినంత దేశంలో మరి ఏ నాయకుడు చేయలేదని, మైనార్టీలకు రూ. 4 వేల కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కానీ ఇచ్చింది రూ. 1000 కోట్లు మాత్రమే అని విమర్శించారు. రంజాన్ తోఫా బంద్ అయింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది, ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ అయింది, ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ అయింది అన్నారు. సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు 20 నెలలు గడుస్తున్నా రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనార్టీలకు మంత్రిగా ఎందుకు అవకాశం ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మరొక మంత్రి మహమూద్ అలీ.. కేసీఆర్ మైనారిటీలకు ఇచ్చిన గౌరవం అది అని గుర్తు హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీలు మంత్రిగా ఉంటే మైనార్టీ పోర్ట్ఫోలియో ఏదో ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ కేసీఆర్ మైనార్టీ మంత్రికి ప్రాధాన్యత ఉన్న శాఖలను ఇచ్చి గౌరవించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. కానీ కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేసినందుకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయేలా బుద్ధి చెప్పాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా, మూసీ పేర్లతో ముస్లిం సోదరుల ఇళ్లను కూల్చిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ కూల్చిన ఇండ్లకు కనీసం నష్టపరిహారం గాని, కొత్తగా ఇళ్లను ఇవ్వలేదు కానీ ఉన్న ఇళ్లను కూలగొట్టాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి స్వయంగా చెబుతాడు నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నాను, కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నానని, కానీ పొద్దుతిరుగుడు పువ్వులాగా బీజేపీ చుట్టే తిరుగుతుంటాడని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. బీజేపీలో చదువుకున్నానని స్వయంగా చెప్పే ముఖ్యమంత్రిని మైనార్టీలు ఎలా నమ్మాలని, అందరం కలిసి పనిచేసి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడానికి కృషి చేయాలని హరీశ్ రావు కోరారు.