09-07-2025 11:35:37 PM
వన్ టౌన్ పరిధిలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పాన్ షాపుల తనిఖీ..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): నిషేధ మాదకద్రవ్యాలు విక్రయించినట్లు తీసుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు(DSP Venkateshwarlu) హెచ్చరించారు. బుధవారం ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య పోలీస్ సిబ్బందితో పాటు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ ను వినియోగించి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో ఉన్న పాన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పాన్ షాపుల పేరుతో నిషేధిత మాదక పదార్థాల విక్రయాన్ని ఏలాగైనా అరికట్టాల్సిందే, యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ఈ ప్రమాదకర పదార్థాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నాం, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి షాప్ ను జాగ్రత్తగా తనిఖీ చేసి, అనుమానాస్పద పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అక్రమ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నవారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాన్ షాపు యజమానులు నిబంధనలను పాటించకపోతే షాపుల మూసివేత సహా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ తనిఖీలలో పోలీస్ అధికారులు ఉన్నారు.