12-07-2025 01:25:59 AM
14న తిరుమలగిరిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి
తుంగతుర్తి, జూలై 11 (విజయక్రాంతి): కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలకేంద్రంలో కొత్త రేషన్కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ మేర కు తిరుమలగిరి మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్ర మం జరిగే సభా స్థలాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి శుక్రవారం మంత్రి ఉత్తమ్ పరిశీలించి మాట్లాడారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా రేషన్కార్డు పంపిణీ జరుగుతుందన్నారు. తెలంగాణలో దాదాపు 3 కోట్ల 14 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారని, వీరికి రూ.13వేల కోట్ల నిధులతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్
రాష్ట్రంలో బీసీల కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ,ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారంగా స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతామని ఆయన పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస ప్రభుత్వం ఒక్క రేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. దేశంలోనే తెలంగాణలో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు విజ్ఞప్తి మేరకు జూనియర్ కాలేజీని, ప్రత్యేకంగా రోడ్లు నిర్మాణం కొరకు ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ మాట్లాడుతూ కష్టపడే కార్యకర్తకు గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సామాజిక న్యాయం చేకూరుస్తుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి బహిరంగ సభను. విజయవంతం చేయాలని కోరారు.
ఈ బహిరంగ సభకు ముఖ్యమంత్రితో పాటు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు హాజరవుతున్నారని తెలిపారు. అనంతరం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి సుమారు 30 నియామక పత్రాలను మంత్రి అందజేశారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ తేజస్ నందనాల్ పవర్, ఎస్పీ నరసింహం, డీసీసీ అధ్యక్షుడు, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ,ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సంకేపల్లి సుధీర్ రెడ్డి, సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , పీసీసీ సభ్యుడు గుడిపాటి నరసయ్య, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
2.4 లక్షల కార్డుల పంపిణీ..
రాష్ట్రవ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా 11.30 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసిందని మంత్రి తెలిపారు. ఇపుడు పంపణీ చేయనున్న కార్డులతో కలిపి రేషన్ కార్డుల సంఖ్య దాదాపు94,72,422కి చేరనుందని. మొత్తంగా 3.14 కోట్ల మందికి లబ్ధి జరుగనుందని ఆయన తెలిపారు.