14-09-2025 01:51:34 AM
ఖమ్మం, సెప్టెంబర్ 13 (విజయంక్రాంతి): ఖమ్మం పట్టణంలో శనివారం మధ్యాహ్నం ౩ గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని పాత బస్టాండ్, ఇల్లెందు క్రాస్రోడ్డు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ ఎడతెరిపి లేకుండా వాన కురువడంతో స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
మరో ఐదు రోజులు.. ఆకాశానికి చిల్లే !
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, నిర్మల్, సిద్ధిపేట, రంగారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది.
అదేవిధంగా కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, వికారబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగరష్త్ర కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారాల్లోనూ వర్షాలు కురువనున్నట్లు పేర్కొంది.