08-10-2025 12:33:07 AM
‘మిరాయ్’ లాంటి విజయవంతమైన చిత్రం తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి ఇప్పుడు ఓ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రాబోతోంది. అదే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రం. ఇందులో శ్రీనిధిశెట్టి, రాశీఖన్నా కథానాయికలు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నీరజ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
నాకు స్కూల్ డేస్ నుంచి రైటింగ్ ఇష్టం. ఒక దశలో సినిమాకు కథ రాయగలననే నమ్మకం కుదిరింది. అలా రాసుకున్న కథల్లో ‘తెలుసు కదా’ ఒకటి. -నేను దాదాపు వంద సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. అదే నా ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ స్కూల్.
సిద్దు సింగిల్ సిట్టింగ్లో మొత్తం కథ విన్నారు. తర్వాత ఆయన మేనేజర్ ఫోన్ చేసి ఈ కథ చేస్తున్నామని చెప్పారు.. అది నా లైఫ్లో మర్చిపోలేను.
ఇదొక లవ్స్టోరీ. ఇద్దరి మధ్య ఉండే ప్రేమకథ. ఒక కాంప్లెక్స్ సిటీ కూడా ఉంది. ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఇందులో మూడు పాత్రలూ చాలా బలంగా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ నిజాయితీగా ఉంటుంది. ప్రతి పాత్రా భావోద్వేగంతో నిండి ఉంటుంది.
నా దృష్టి కథను నిజాయితీగా చెప్పడంపైనే ఉంది. అబ్బాయి తీశారా.. అమ్మాయా.. అన్నదానికంటే గుడ్ ఫిలిం మేకర్ తీసిన సినిమా అని పేరు తెచ్చుకోవడమే ఇష్టం.
ఎన్ని సినిమాలు చేసినా కొందరికి ఐకానిక్ రోల్ దొరకదు. సిద్దూకు టిల్లు లాంటి క్యారెక్టర్ కెరీర్ ఆరంభంలోనే పడింది. అలాంటి ఇమేజ్ ఉన్నప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ చేయడం ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమే. కానీ ఇందులో వరుణ్ పాత్రను సిద్దు చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారు. సిద్దుకు యూనిక్ పర్స్పెక్టివ్ ఉంటుంది. తన వల్ల నా రైటింగ్ బెటర్ అయ్యింది.