08-10-2025 01:34:32 AM
దున్నపోతు అని మంత్రి అడ్లూరిని
దూషించిన మరో మంత్రి పొన్నం
క్షమాపణ చెప్పాలని అడ్లూరి డిమాండ్
24 గం. డెడ్లైన్
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : ‘పొన్నం తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాలి.. మాదిగలంటే అంతా చిన్నచూపా..? భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత పొన్నమే వహించాలి’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ హెచ్చరించారు. పొన్నం లాగా దురుసుగా ప్రవర్తించ డం తనకు రాదని, తను పార్టీలో సామాన్య కార్యకర్తను అంటూ మంగళవారం ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
‘నేను మంత్రి కావడం వివేక్ జీర్ణించుకోవడం లేదు, నేను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నారు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో వివేక్ అసంతృప్తిగా ఉన్నారు, ఆ అక్కసు నాపై చూపిస్తున్నారు. నాకు వివేక్ లాగా డబ్బులు లేవు.. నేను కాంగ్రెస్ జెండా ను నమ్ముకున్న వాడిని’ అని తెలిపారు. తనను అన్న మాటలకు తప్పు ఒప్పుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ కోరితే ఆయనకు గౌరవం ఉంటుందని, వ్యక్తిగతంగా భవిష్యత్తులో ఇంకెవరిని దూషించడం తప్పని గుర్తిస్తే మంచిదని ఆయన హితవు పలికారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నా.. పక్కనే ఉన్న దళిత బిడ్డ మంత్రి వివేక్ కూడా.. తాను రాకపోతే సమావేశం నుంచి లేచి వెళ్లిపోతామనడం భావ్యమేనా..? అని అడ్లూరి ప్రశ్నిం చారు. ఆయన కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా నిలబడితే..
తాము అన్నీ మీద వేసుకుని గెలిపించామని, వాళ్ల తండ్రి వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పటి నుంచి కాంగ్రె స్ పార్టీకి, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వాళ్ల కుటుంబానికి విధేయులుగా పనిచేశామని మంత్రి లక్ష్మణ్కుమార్ గుర్తుచేశారు. తమ తోటి సామాజికవర్గం వాడి పట్ల ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నావని మంత్రి వివేక్ వేదికపై ఉన్న మంత్రి పొన్నం ను ఒక్కమాట అనాలా..? వాద్దా..? అని అడ్లూరి ప్రశ్నించారు.
నా తండ్రి కేంద్ర మంత్రి కాదు, నేను డబ్బున్నోడిని కాదు..
జూబ్లీహిల్స్లో రెండ్రోజుల క్రితం మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రాం జరిగింది. సంబంధిత శాఖ మంత్రిగా తాను 3.30కి కార్యక్రమానికి హాజరవుతానని చెప్పానని మంత్రి అడ్లూరి తెలిపారు. తాను, తన వెంట ఉన్న ఎస్కార్ట్ టీమ్ భోజనం చేయలేదని వక్ఫ్ బోర్డు చైర్మన్ పహీమ్కు చెప్పానని అన్నారు. ఇంతలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ తమకు అర్జెంట్ ఉందని చెప్పారు. మళ్లీ కాల్ చేస్తే.. సమావేశం ప్రారంభించమని మధ్యలో వచ్చి జాయిన్ అవుతానని చెప్పినట్లుగా అడ్లూరి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లో సాధారణ కార్యకర్త నుంచి మంత్రి స్థా యికి ఎదిగానని, తన తండ్రి కేంద్ర మంత్రి కాదని, డబ్బున్నోడిని కాదని ఆయన అన్నారు.
ఉద్రేకపూర్వకంగా మాట్లాడను..
పొన్నం ప్రభాకర్ లాగా తను ఉద్రేకపూర్వకంగా మాట్లాడనని, వాళ్ల ముందు చిన్న వ్యక్తినని అడ్లూరి అన్నారు. మొదటి నుంచి వివేక్కు తాను పక్కనే కూర్చోవడం నచ్చదని, ఆయన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన వ్యక్తి అని కామెంట్ చేశారు. ఒక్క పార్టీ కింద పని చేస్తున్నప్పుడు.. తమ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని మీడియా ముందు కూడా తనను ఉద్దేశించి పొన్నం అనకపోవచ్చని తాను చెప్పానన్నారు. జరిగిన విష యం మీద పొన్నం తనకు ఫోన్ చేసి మాట్లాడడతారని అనుకున్నా కానీ, అదేం జరగలేద న్నారు.
తనను వ్యక్తిగతంగా అంటే మాట పడొచ్చేమో కానీ.. మొత్తం మాదిగ జాతిని అనడం కరెక్ట్ కాదన్నారు. తాము రేపటి వరకు పొన్నం ప్రభాకర్ నుంచి సమాధానం ఆశిస్తున్నామని.. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు అవుతాడని ప్రకటించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా, తనకు అండగా నిలబడిన మాదిగలకు మంత్రి అడ్లూరి కృతజ్ఞతలు తెలిపారు.