21 March, 2026 | 10:54 AM

భాగ్యనగరాన్ని ముంచెత్తిన వర్షం

08-10-2025 12:38 AM
  1. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం కుండపోత 
  2. పలుచోట్ల రహదారులు జలమయం  
  3. తీవ్ర అవస్థలకు గురైన వాహనదారుల  

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో మంగళవారం వర్షం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు, సాయంత్రం వేళ కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించిం ది. అయితే, గంటకు పైగా కుండపోతగా కురిసిన వానకు భాగ్యనగరంలోని అనేక ప్రధాన రహదారులు జలమయమై, వాహనదారులకు అవస్థలు తప్పలేదు.

సాయంత్రం కార్యాలయాలు ముగిసే సమయానికి వర్షం ప్రారంభం కావడంతో, ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు, ప్రయాణికులు నానా పా ట్లు పడ్డారు. నగరంలోని కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకా పూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ వంటి వాణిజ్య ప్రాంతాలతో పాటు నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్‌లలో వాన దంచికొట్టింది. అదేవిధంగా, శివార్లలోని రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, అత్తాపూర్, శివరాంపల్లి, గండిపేట్‌లలోనూ భారీ వర్షం నమోదైంది.

రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం, గచ్చిబౌలితో పాటు పంజాగుట్ట, అమీర్‌పేట్, పాతబస్తీలోని చార్మినార్, బహదూర్‌పురా, యాకత్ పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో సాధారణం నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది. జీహెఎంసీ డీఆర్‌ఎఫ్ బృం దాలు రంగంలోకి దిగి, రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే దిశగా చర్యలు చేపడుతున్నాయి.